పేజీలు

21, జనవరి 2025, మంగళవారం

కంబాల కొండ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం


విశాఖ నగర పలక సంస్థ పరిధి లో సాగర తీరానికి అభిముఖంగా 70.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో ఉన్న దట్టమైన కంబాల కొండ అటవీ ప్రాంతం ప్రకృతి  రమణీయతకు ప్రసిద్ది.  మహా నగరం నుండి కంబాలకొండ ఆవరణలోకి అడుగుపెట్టగానే అదొక ప్రత్యేక ప్రపంచంలా  అనిపిస్తుంది. పచ్చని చెట్లపై కూర్చొని రకరకాల పక్షులు వింత వింతగా సందడి చేస్తూ ఉంటాయి. 

కంబాల కొండ ప్రాంతంలో అనేక జంతు, వృక్ష జాతులు ఉన్నాయి. వీటిలో అరుదైన జాతులు కూడా ఉన్నాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న రేసు కుక్కలు, ప్రపంచంలో అతిచిన్న జింక జాతి 'మచ్చ జింకల గుంపు'  చిరు కొండ మేకలు, ముళ్లపందులు, గురుడు పందులు, పాముల జాతులకు చెందిన పిట్ వైపర్స్, రసల్స్ వైపర్ కూడా ఇక్కడున్నాయి. 

జీవ జాతులు

  1. వృక్ష జాతులు
  2. జంతు జాతులు
  3. సరీసృపాలు
  4. పక్షి జాతులు
  5. సీతాకోక చిలుకలు

ఈ ప్రాంతం 1970 వరకు విజయనగరం మహా రాజాల అధీనం లో ఉండేది. తదుపరి దీనిని అటవీ శాఖ అధీనం లోకి తీసుకుని వన్యప్రాణి సంరక్షణా కేంద్రం గా ప్రకటించారు. ఇది పొడి సతత హరితారణ్యాల కోవకు చెంది సంవత్సరం పొడుగునా పచ్చదనం కలిగి ఉంటుంది.

కంబాల కొండ - ఎకో టూరిజం పార్క్

దీనిని అటవీ శాఖ ఎకో-టూరిజంగా  ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేసింది. ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ మూడు ట్రెక్కింగ్ మార్గాలు ఏర్పాటు చేసారు. ఇక్కడ లివ్ ఇన్ అడ్వెంచర్స్ సంస్థ పర్యాటకుల కోసం  సాహస క్రీడలను ఏర్పాటు చేసింది.   'స్కై వాక్.. గోట్ వాక్... టైర్ వాక్... వ్యాలీ క్రాసింగ్' లను ఏర్పాటు చేశారు. ఇక్కడ బోటింగ్ సౌకర్యం  ఉంది. పిల్లల అట స్థలం అభివృద్ధి చేసారు.  

కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు రూ. పెద్దలకు 10, పిల్లలకు రూ.5. వాహనంలోకి ప్రవేశించేందుకు రూ. 200, ఇందులో ఐదుగురు సభ్యుల ప్రవేశ రుసుము కూడా ఉంటుంది. మీరు క్యాబిన్ రిజర్వ్ చేయాలనుకుంటే, ఛార్జీ రూ.250. ట్రెక్కింగ్ ఛార్జీలు 10 మంది సభ్యుల బృందానికి రూ.150. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం వారంలో ప్రతిరోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 4:30 వరకు తెరిచి ఉంటుంది. ట్రెక్కింగ్ ఉదయం 6 గంటల నుండి మొదలవుతుంది. దీని కొరకు ముందు రోజునే తెలియపరచాలి. ట్రెక్కింగ్ చేసివారికి ప్రతీ 10 మంది సభ్యుల బృందానికి ఒక గైడ్ ని ఏర్పాటు చేస్తారు.

ఎలా చేరుకోవాలి?

కంబాల కొండ విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో జాతీయ రహదారి 16 ఆనుకొని ఉంది.  విశాఖపట్నం లోని అన్ని ప్రాంతాల నుండి సిటీ బస్సులు, ఆటో, క్యాబ్స్ ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.   దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా విశాఖపట్నం చేరుకోవచ్చు.

సమీప బస్సు స్టేషన్: ద్వారక బస్సు స్టేషన్ కాంప్లెక్స్  (7.2 KM)
సమీప రైల్వే స్టేషన్: విశాఖ పట్నం జంక్షన్ (9.1 KM)
సమీప విమానాశ్రయం : విశాఖపట్నం అంతర్జీతీయ విమానాశ్రయం (18 KM)

వసతి మరియు భోజన సదుపాయాలు  

కంబాల కొండ ఎకో టూరిజం పార్క్ లో అటవీ శాఖ నిర్వహించే కాటేజీలు ఉన్నాయి. విశాఖపట్నం నగరం లో అన్ని స్థాయిల హోటల్స్, రిసార్టులు, రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి