పేజీలు

20, జనవరి 2025, సోమవారం

రామ నారాయణం

రామనారాయణం - శ్రీమద్రామాయణ ప్రాంగణం విజయనగరం జిల్లాలోని చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. విజయనగరానికి చెందిన ఎన్.సి.ఎస్.ఛారిటబుల్ ట్రస్టు స్థాపకులు, నిర్వాహకులు అయిన శ్రీ నారాయణం నరసింహ మూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు కట్టించిన అద్భుత కట్టడం ఇది. మార్చి 22, 2014 నాడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభోత్సవం జరిగింది. గరికపాటి నరసింహ మూర్తిగారు, తిరుపావై కోకిల మంజుశ్రీ, చాగంటి కోటేశ్వర రావు గారితో సహా ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అద్భుత ప్రసంగాలతో భక్తులను అలరింప చేసారు.


ఎక్కుపెట్టిన ధనుస్సు ఆకారంలో నిర్మింప బడిన ఈ కట్టడం పూర్తిగా రామాయణ సారాన్ని బోధిస్తుంది. ప్రధాన ద్వారం దాటగానే సర్వ విఘ్న హర్త అయిన వినాయకుడి ఆలయం ఉంది.ఈ కట్టడం రెండు అంతస్తులుగా ఉంది. పై అంతస్తులో ధనువుకు ఒక చివర, విష్ణు ఆలయం, మరొక చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామాలయం ఉన్నాయి. ఈ రెంటిని కలుపుతూ ఒక కారిడార్ ఉంది అందులో మొత్తం 72 కుడ్య చిత్రాలలో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వ్యాఖ్యలు కూడా తెలుగు, ఇంగ్లీషు రెండు భాషలలో వ్రాసారు. ధనువు ఆకారం లోని తోలి సగం కారిడార్ లో 36, మలి సగం కారిడార్ లో 36 మొత్తం 72 కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ చివర విష్ణు, ఆ చివర రామ ఆలయాలు నిర్మించడంలో రహస్యం-విష్ణువే రామునిగా అవతరించాడు అని. ధనువు మధ్య భాగం లోని కట్టడంలో ఒక పెద్ద వేదిక పైన 60 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం చూపరులను కట్టి పడేస్తుంది. కింద నుంచి ఈ విగ్రహం వరకు వెళ్ళే దారిలో రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జల యంత్రాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కింద నుంచి పైకి వెళ్లేందుకు విశాలమైన సోపాన శ్రేణి ఉంది. పైన ఆలయాల బయట జయ విజయులు, గరుత్మంతుడు, శుకుడు, నారద తుంబురుల యొక్క విగ్రహాలు ఉన్నాయి.

కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు శోభాయ మానంగా ఉంటాయి. ఈ రెండు విగ్రహాల వద్ద కుడా ఫౌంటెన్ లు ఉన్నాయి. మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన నారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం ఉంది. ఆయనకు సర్వదా పుష్పాంజలి సమర్పిస్తున్నట్టుగా 5,6 ఆవృతాలలో పూలమొక్కలు ఉన్నాయి. కింద అంతస్తులో నిత్య అన్నప్రసాదశాల, గ్రంథాలయం, వేద పాథశాల, ధ్యానమందిరం, కళ్యాణమండపం, సుదర్శనచక్ర ఆకారములో నిర్మించిన గోశాల ఉన్నాయి. వీటన్నిటికి, శబరీ, సుగ్రీవ, ఇలా రామాయణంలో వినిపించే పాత్రల పేర్లే పెట్టారు. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వనములతో ఔషధి వృక్షాలతో కనువిందు చేస్తుంది.

ఈ ప్రాంగణాన్ని 15 ఎకరాల విస్తీర్ణంలో ధనస్సు ఆకారంలో నిర్మించారు. అందులో మధ్య భాగాన 60 అడుగుల ఎత్తు గల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. వాల్మీకి రామాయణంలోని భాగాలను 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించి 72 విగ్రహాలను ఏర్పాటు చేసారు. ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసారు. సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోదలచినపుడు అక్కడ ఏ భాషలో కావాలంటే ఆ భాషను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. సెంట్రల్ ఎయిర్‌కండీషన్డ్‌తో ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందర్శకులకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఆకట్టుకుంటుంది.

NCS Charitable ట్రస్ట్ చైర్మన్ శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు 11 తరగతి గదులు, 2 ఎకరాల స్థలంలో ఈ భవనంలో టి.టి.డి ఆధ్వర్యంలో వేద పాఠశాలను నెలకోల్పారు. ఇందులో 90 మంది విద్యార్థులు సామవేదం విద్యను అభ్యసిస్తుంటారు. 

ఎలా చేరుకోవాలి?

విజయ నగరం నగర శివారు ప్రాంతంలో విజయనగరం - సొంట్యాం 134 వ రాష్ట్ర రహదారి లో ఉంది. విశాఖపట్నం నుండి విజయనగరం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల ద్వారా చేరుకోవచ్చు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి విజయనగరం కు బస్సు సౌకర్యం ఉంది. చెన్నై - కోల్కతా రైలు మార్గం లో విజయనగరం ఒక ప్రధాన జంక్షన్. 

మండల మరియు జిల్లా కేంద్రం: విజయనగరం (5 KM) 

సమీప పట్టణం: విజయనగరం (5 KM)

సమీప బస్సు స్టేషన్: విజయనగరం (5.5 KM)

సమీప రైల్వే స్టేషన్: విజయనగరం (5.7 KM)

సమీప విమానాశ్రయం: విశాఖపట్నం (48 KM)

వసతి మరియు భోజన సౌకర్యాలు

విజయనగరం నందు బడ్జెట్ హోటల్స్ నుండి స్టార్ హోటల్స్ వరకు అందుబాటులో ఉన్నాయి.  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి