పేజీలు

21, జనవరి 2025, మంగళవారం

వంజంగి కొండ

అల్లూరి సీతారామరాజు జిల్లా లోని పాడేరు సమీపంలోని వంజంగి కొండ  మేఘాల కొండ గా ప్రసిద్ది చెందింది. ఇది సముద్ర మట్టం నుండి సుమారుగా 3400 అడుగుల ఎత్తులో ఉంటుంది. మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న ఈ ప్రాంతంలో కొండ మధ్య నుంచి ఉదయించే సూర్యుడిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తారు. సినిమాలలో CG ద్వారా సృష్టించే అందాల కు మించిన అనుభూతినీ కలిగిస్తుంది. ఇక్కడ శీతాకాలం కనిష్ట ఉష్ణోగ్రత 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవుతుంది. ప్రతీ ఏడాది నవంబర్ నుండి జనవరి మధ్యలో ఉదయం 8 గంటల లోపు పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాలను అనుభూతి చెందవచ్చు. అయితే ఇక్కడ నుండి సూర్యోదయం అనేది అత్యంత మరింత కనువిందు చేసే అంశం కాబట్టి పర్యాటకులు ఉదయం 6 గంటల కన్నా ముందే ఇక్కడకు చేరుకుంటారు. 


బేస్ నుండి కొండ పైకి చేరుకోవడానికి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇందులో రెండు కిలోమీటర్ల దూరం రహదారి ఉన్నప్పటికీ అత్యంత కఠినంగా ఉంటుంది. అవకాశం ఉన్నంత మేరకు స్థానికంగా వాహనాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. మిగిలిన కిలోమీటరు దూరం తప్పనిసరిగా ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటి అర కిలోమీటరు ట్రెక్ తరువాత కొండపై విశాలమైన భాగాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ నుండి సూర్యోదయాన్ని ఆస్వాదించవచ్చు. ఈ మార్గం సన్నటి మట్టి బాట. అంత క్లిష్టమైనది ఏమీ కాదు. కొండపై ఉన్నా ఈ విశాల భాగం శిఖరాన్ని చేరుకోవడం కొంచెం క్లిష్టమైనది. పూర్తిగా రాళ్లతో నిండి ఉంటుంది. అయినప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సునాయాసంగా చాలా మంది శిఖరాన్ని చేరుకుంటారు. 

ఇక్కడకు చేరుకోవడానికి వేకువ జామున 3 గంటలకే బయలుదేరడం ఉత్తమం. శీతల ప్రదేశం కాబట్టి దానికి అనువైన దుస్తులు ధరించాలి. ముఖ్యం గా శనివారం, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వాహనాలలో బయలు దేరే వారు అయినా 3 గంటలకే బయలు దేరి సూర్యోదయానికి ముందే చేరుకునేలా చూసుకోవాలి. 
 కొండపైన ఉండే మైదాన ప్రాంతం లో కాఫీ, టీ, నూడిల్స్, బిస్కెట్స్ వంటి స్నాక్స్ లభిస్తాయి. కాకపోతే స్వల్పంగా ధరలు ఎక్కువగా ఉంటాయి. 

ఎలా చేరుకోవాలి?

వంజంగి కొండ శిఖరం రాజమహేంద్రవరం - విజయనగరం జాతీయ రహదారి 516 E నుండి 6.4 కిలోమీటర్ల దూరం లో ఉంది. వంజంగి కి 7 km దూరం లోని పాడేరు కు చెన్నై - కోల్కతా రైలు మార్గం, జాతీయ రహదారి లో ఉన్న విశాఖపట్నం, అనకాపల్లి, తుని, విజయనగరం మరియు ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఆయిన అరకు నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ లు అందుబాటులో ఉన్నాయి. పాడేరు నుండి వంజంగి కి సొంత వాహనాలు లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ నీ ఆశ్రయించాల్సి ఉంటుంది. 

మండల మరియు జిల్లా కేంద్రం : పాడేరు  (7.8 km)
సమీప పట్టణం : నర్సీపట్నం (81 km)
సమీప బస్ స్టేషన్ : పాడేరు (8.8 km)
సమీప రైల్వే స్టేషన్ : అరకు (50 km), అనకాపల్లి (80 km)
సమీప విమానాశ్రయం: విశాఖపట్నం (101 km)

వసతి మరియు భోజన సదుపాయాలు


పాడేరు నందు పరిమితంగా బడ్జెట్ హోటల్స్ ఉన్నాయి. సీజన్ లో అయితే బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. ఇక టెంట్స్ వంటివి  వంజంగి కొండ బేస్ వద్ద అందుబాటులో ఉంటాయి. సాధారణ హోటల్స్, రెస్టారెంట్ లు పాడేరు లో అందుబాటు లో ఉన్నాయి. స్టార్ కేటగిరీ వసతులు అయితే 50 km దూరం లోని అరకు లో విస్తారంగా లభిస్తాయి. 50 km దూరం లోనే ఉన్న లంబసింగి లో కూడా లభిస్తాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి